AP High Court : టీటీడీ పాలక మండలి సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు
టీటీడీ సభ్యులు ఉదయభాను, కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
- bheemraj
- Published On : September 13, 2023 / 07:18 PM IST
AP High Court notices
AP High Court Notice : టీటీడీ పాలక మండలి సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలిలో అనర్హులను సభ్యులుగా నియమించారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. టీటీడీ సభ్యులు ఉదయభాను, కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర నేపథ్యం కలిగిన వారికి సభ్యత్వం కల్పించారన్న పిటిషన్ పై తొలుత సెప్టెంబర్ 6న హైకోర్టులో విచారణ జరిగింది. పాలకమండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలను అందజేయాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేర చరిత్ర కలిగి వ్యక్తులను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించడంపై విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు స్వీకరించింది. జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. దేవాదాయ చట్టాలకు వ్యతిరేకంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు శరత్ చంద్రరెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను నియామకం చెల్లదంటూ పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ తరపున న్యాయవాది జయ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోలను వివరణ కోరింది. పాలక మండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. టీటీడీ పాలక మండలి సభ్యులకు నోటీసులు జారీ చేసింది.
