Vangalapudi Anitha
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇవాళ ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి అనిత పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం సైనిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జాతీయరహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పక్క నుంచి వచ్చిన ఓ బైక్ను తప్పించే సమయంలో ఆమె ఎస్కార్ట్ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బైకును అనిత ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అనిత కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కారు ప్రమాదంపై అనిత స్పందిస్తూ… ఎక్స్కార్ట్ వాహనానికి బైక్ అడ్డు వచ్చినప్పుడు తమ డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్వల్పంగా డామేజ్ అయ్యిందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు తనకేంకాదని తెలిపారు. అందరు తనకు ఫోన్లు చేస్తున్నారని, తాను బాగానే ఉన్నానని చెప్పారు.
ప్రజలు ఎవరూ ఆందోళన చెందే అవసరం లేదని అనిత తెలిపారు.
Also Read: కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో పెడతారంటూ బండి సంజయ్ ఎలా మాట్లాడతారు?: రావుల శ్రీధర్ రెడ్డి