ap panchayat elections : ఉద్రిక్తతల నడుమ ఏపీలో తొలిదశకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయ్యింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చాలా ప్రాంతాల్లో రాత్రి వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికలు 168 మండలాల్లో జరుగుతున్నాయి.
ఈ విడతలో 3వేల 251 గ్రామ పంచాయతీలకు, 32వేల 522 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో సర్పంచ్ పదవులకు 19వేల 491 మంది నామినేషన్లు వేశారు. ఇక వార్డు సభ్యుల పదవులకు ఏకంగా 79వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం నుంచి చేపట్టనున్నారు. దీంతో ఎవరెవరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయో అధికారులు వెల్లడించనున్నారు. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఉంది. ఫిబ్రవరి 9న పోలింగ్ జరుగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలను వెల్లడించనున్నారు.