AP Vahanamitra : ఆటో డ్రైవర్లకు అలర్ట్.. ఇవాళే లాస్ట్డేట్.. రూ.15వేలు అకౌంట్లో పడాలంటే వెంటనే ఇలా చేయండి..
AP Vahanamitra : ఈనెల 24వ తేదీ నాటికి వాహన మిత్రకు అర్హత పొందిన వారి తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
- Harishth Thanniru
- Published On : September 19, 2025 / 12:57 PM IST
AP Vahanamitra
AP Vahanamitra : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇదే సమయంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వాహన మిత్ర పథకం కింద ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది.
గత ప్రభుత్వంలో ఈ పథకం కింద 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరిస్తారు. ఈ పథకంకు అర్హులైన కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగులు ఆన్ లైన్లో ప్రక్రియ చేపడుతున్నారు. నేటితో (శుక్రవారం)తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.
ఈనెల 22వ తేదీ నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలనను అధికారులు పూర్తి చేయనున్నారు. ఈనెల 24వ తేదీ నాటికి వాహన మిత్రకు అర్హత పొందిన వారి తుది జాబితాను విడుదల చేస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15వేలు జమ కానున్నాయి.
దరఖాస్తు ఇలా..
♦ అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
♦ తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
♦ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండరాదు.
♦ వెయ్యి చదరపు అడుగులు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులవుతారు.
♦ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్ నెస్ ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
♦ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి.
