Ram Gopal Varma : రామ్గోపాల్ వర్మపై ఏపీ మహిళ కమిషన్ సీరియస్
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు.
- chvmurthy
- Published On : June 25, 2022 / 08:39 PM IST
Ram Gopal Varma
Ram Gopal Varma : ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. రాష్ట్ర మహిళా కమీషన్ తరుఫున ఆర్జీవీ కి నోటీసులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ద్రౌపది ముర్ముపై వర్మ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈరోజు ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళా కమిషన్ సెమినార్ కు హాజరైన ఆమె ఏపీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని ఆమె వెల్లడించారు. మహిళా కమిషన్ చొరవతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేయడం సంతోషకరమన్నారు.
మహిళా కమిషన్ ఏడాది కార్యచరణ ‘సబల’లో భాగంగా మహిళలపై లైంగిక వేధింపులు – పరిష్కారాల అజెండాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించుచున్నారు. ఆయా వేదికల నుంచి తయారు చేసి సమర్పించిన నివేదిక నేపథ్యంలో ఏపీ సర్కారు తక్షణమే స్పందించడంపై వాసిరెడ్డి పద్మ ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ రాష్ట్రంలో మహిళల భద్రతకు చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు నివేదించామన్నారు. పదిమందికి మించి మహిళలు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు తప్పనిసరని.. మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు. అదేవిధంగా స్థానిక ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు పై కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. అక్రమ రవాణా నిరోధానికి పోలీసు శాఖ సమన్వయంతో మహిళా కమిషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు.
Also Read : Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు
