Army Chopper Crash : హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో..ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం
- venkaiahnaidu
- Published On : December 8, 2021 / 09:08 PM IST
Ar888
Army Chopper Crash : తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో..ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
2015 లో సిద్ధారెడ్డి పల్లి కి చెందిన శ్యామల తో సాయితేజ్కు వివాహం కాగా, వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయమే సాయితేజ్ వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు. చివరిసారిగా గత వినాయకచవితికి స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ్ వచ్చి వెళ్లినట్లు కుటుంబసభ్యులు గుర్తుచేసుకుంటున్నారు.
సాయితేజ్.. 2013లో ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సైనికులకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా,సాయితేజ్ తమ్ముడు కూడా ఆర్మీలోనే సేవలందిస్తున్నారు. సాయితేజ్ మహేష్ బాబు సిక్కింలో ఆర్మీ విధులు నిర్వహిస్తున్నారు.
ఇక,ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ప్రకటించింది.
ALSO READ RIP General Bipin Rawat :హెలికాఫ్టర్ ప్రమాదానికి ముందు..ప్రమాదం తర్వాత అసలు జరిగిందిదే
ALSO READ RIP CDS General Bipin Rawat : నిజమైన దేశభక్తుడు బిపిన్ రావత్..ప్రముఖుల సంతాపం
