×
Ad

ఆ బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపిన సీఎం చంద్రబాబు.. అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని..

  • Published On : October 23, 2024 / 06:22 PM IST

Cm Chandrababu On Badwel Girl Incident (Photo Credit : Google)

Badvel Girl Incident : వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ లో పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఉదయం బాధిత కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపిన సీఎం చంద్రబాబు.. అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అనంతరం ఇంఛార్జ్ కలెక్టర్, టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి చెక్ అందించారు.

Also Read : ఇదే పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది- సీఎం చంద్రబాబుకి జగన్ వార్నింగ్..

ఇంటర్ చదువుతున్న బాలిక.. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయింది. మాట్లాడుకుందామని పిలిచిన నిందితుడు.. పక్కా ప్లాన్ ప్రకారం తన వెంట పెట్రోల్ తెచ్చుకున్నాడని, బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. తీవ్రమైన కాలిన గాయాలతో బాలిక మృత్యువాత పడింది. బద్వేల్ లో జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.

నిందితుడికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు, కాదు కాదు.. వైసీపీ నేతలతోనే సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని కాపాడేందుకు ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ధ్వజమెత్తారు.