Balakrishna PA Balaji Arrest : ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ అరెస్ట్.. వైసీపీ నేతలతో కలిసి పేకాట
ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో పేకాట స్థావరాలపై కర్నాటక పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ రెస్టారెంట్ లో కార్డ్స్ ఆడుతున్న..(Balakrishna PA Balaji)
- Naveen
- Published On : March 21, 2022 / 09:47 PM IST
Balakrishna Pa Balaji
Balakrishna PA Balaji Arrest : ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో పేకాట స్థావరాలపై కర్నాటక పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ రెస్టారెంట్ లో కార్డ్స్ ఆడుతున్న 19మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ, హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు. వారితో పాటు 9మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారి నుంచి భారీగా నగదు, నాలుగు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను చిక్ బళ్లాపూర్ గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.
పేకాట ఆడుతూ అదీ వైసీపీ నేతలతో కలిసి.. బాలకృష్ణ పీఏ బాలాజీ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో కొందరు పేకాట ఆడుతున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 19 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఇందులో హిందూపురంకు చెందిన పేకాటరాయుళ్లు దొరికారు. పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందిన వారున్నారు. వారిలో బాలకృష్ణ పీఏగా పనిచేస్తున్న బాలాజీతో పాటు హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు.(Balakrishna PA Balaji)
వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పేకాట ఆడటం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో వ్యక్తిగత పనుల కోసం పెట్టుకున్న వ్యక్తి ఇలా ప్రత్యర్థులతో సిట్టింగ్ వేయడంపై హిందూపురంలో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ వైరం కొనసాగుతోంది. ఇక హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ పార్టీ తీరుని ఎండగడుతూ పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పీఏ.. ఏకంగా అధికార వైసీపీ నేతలతో కలిసిపోయి పేకాట ఆడటం తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురి చేసింది.
Lokesh On Pegasus Spyware : పెగాసస్ వివాదం.. ఏ విచారణకైనా సిద్ధం-నారా లోకేష్
గతంలో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏగా ఉన్న శేఖర్ తీరుతో హిందూపురంలో అనేక సమస్యలు వచ్చాయి. పీఏ పెత్తనంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శేఖర్ పై అనేక అవినీతి ఆరోపణలూ వచ్చాయి. దీంతో శేఖర్ను తప్పించిన బాలయ్య.. బాలాజీని తన పీఏగా పెట్టుకున్నారు. ఇప్పుడు బాలాజీ వ్యవహార శైలిపైనా టీడీపీ శ్రేణుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూపోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీని తప్పించాలని ఇప్పటికే బాలయ్యకు తెలుగు తమ్ముళ్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు.
దాదాపు ఐదేళ్లకు పైగా బాలకృష్ణకు పీఏగా బాలాజీ వ్యవహరిస్తున్నాడు. బాలయ్య హిందూపురం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నాడు. బాలకృష్ణ లేని సమయంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను కూడా బాలాజీ చక్కబెడుతున్నాడు. బాలయ్యకు అత్యంత కీలకమైన వ్యక్తి అధికార పార్టీ నేతలతో పేకాట ఆడటం, ఆపై పోలీసులకు చిక్కడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.
