bk parthasarathi supporters protest in penukonda for tdp ticket
Penukonda TDP Protest: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను శనివారం టీడీపీ, జనసేన పార్టీలు విడుదల చేశాయి. 94 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. అయితే కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులకు టికెట్ దక్కకపోవడంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులకు మద్దతుగా ఆయా నేతల అనుచరులు ఆందోళన బాట పట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ నిరసనలకు దిగుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలు దగ్ధం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ ను సవితకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు కమ్మ రాజకీయం చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలు తగలబెట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. బీకే పార్థసారథికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఇక్కడికి వచ్చి పెనుకొండలో పార్టీని గెలిపించమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
Also Read: టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 94 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే..
కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పెనుకొండ టీడీపీ టికెట్ బీకే పార్థసారథికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్త ఒకరు కరెంట్ ఫోల్ ఎక్కారు. సవితమ్మ వద్దు బీకే ముద్దు.. అంటూ నినాదాలు చేశారు. పార్థసారథికి టికెట్ ఇవ్వకపోతే కరెంట్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానిక నాయకులు, పోలీసులు అతడిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన
సంయమనం పాటించండి
కార్యకర్తలు సంయమనం పాటించాలని పార్థసారథి కోరారు. అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, పార్టీ పెద్దల స్పందన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. కాగా, టికెట్ ఇవ్వకుండా అవమానించిన పార్టీకి రాజీనామా చేయాలని పార్థసారథిపై ఆయన మద్దతుదారులు వత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.