Botsa satyanarayana: కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై కార్మికుల్లో అనుమానాలు: బొత్స సత్యనారాయణ

శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుండబద్దలు కొట్టినట్లు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

Botsa satyanarayana

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్యాకేజీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని బొత్స చెప్పారు.

విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుండబద్దలు కొట్టినట్లు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సర్కారు అప్పట్లో వద్దనడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని కేంద్ర మంత్రి కుమార స్వామి స్పష్టం చేశారని బొత్స అన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగబోదని ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా, ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు ప్రకటించిన ప్యాకేజీ ప్రైవేటీకరణలో భాగంగానేనని చెప్పారు. ప్రభుత్వ తీరును స్పష్టం చేయాలని అన్నారు.

కేంద్ర సర్కారు రూ.11 వేల కోట్ల ప్యాకేజీని ఇస్తూ ఎన్నో షరతులు విధించిందని తెలిపారు. దీని వెనుక మరేదో ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేగాక, సొంతగా గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్నారు. యూపీలో అంతమంది కుంభమేళాకు వచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనా జరగలేదని ఆయన చెప్పారు. ఇక్కడ తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఏపీ సర్కారుకి ప్రచారం కోసం తాపత్రయం ఎక్కువని చెప్పారు.

అమిత్‌ షాతో ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు?: అంబటి రాంబాబు