విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. ఆ ఫ్యాక్టరీ కోసం రైతులు వేలాది ఎకరాల భూములను త్యాగం చేశారని అన్నారు.
ఇప్పుడు ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన అధికారంలోకి వచ్చాక స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. దాని ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ చెప్పారని అన్నారు. ఆ ప్లాంట్ కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
రెండు వారాల నుంచి కార్మికులు నిరసన చేస్తున్నారని, దీనిపై కూటమి సర్కారు వైఖరి ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఏర్పడిందని అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్లాంట్ విస్తరణకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు వచ్చిన అనంతరం సమస్యలు ప్రారంభమయ్యాయని అన్నారు.