×
Ad

Bus Accident : ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు..

Bus Accident : ఏపీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న..

Bus Accident

Bus Accident : ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. బస్సు ప్రమాద సమయంలో అందులో 38మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలి వద్ద ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

స్థానికుల సమాచారం మేరకు.. ప్రమాదానికి గురైన AP 39 UM 6543 నెంబర్‌ గల ప్రైవేట్ బస్సు 37మందితో భద్రాచలం నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. ఈ బస్సు చిత్తూరులో మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా తెలుస్తోంది. ఈనెల 6వ తేదీ రాత్రి 9గంటలకు 38మందితో యాత్రకు బయలుదేరింది. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఏర్పాటైంది. బస్సు ప్రమాదానికి ముందు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొండ ప్రాంతం ప్రదేశం కావడం.. ఘాట్ రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికశాతం మంది 50ఏళ్ల వయస్సు పైబడిన వారేనని తెలుస్తోంది.