Vizianagaram Train Accident : వారికి కూడా చికిత్స అందించాలి.. రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన బీవీ రాఘవులు..
రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల వారికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి రూ. 25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
- Harishth Thanniru
- Updated on- October 30, 2023 / 11:26 AM IST
BV Raghavulu
CPM Leader BV Raghavulu : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం విధితమే. కొత్తవలస మండలం కంటకాపల్లి – ఆలమండ మధ్య ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలాఉంటే రైలు ప్రమాదంలో గాయాలతో చికిత్స పొందుతున్న వారిని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావులు పరామర్శించారు.
బీవీ రాఘవులు మాట్లాడుతూ.. రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరం. తీవ్ర గాయాలైన వారికి ప్రత్యేక చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారుకూడా క్షతగాత్రుల్లో ఉన్నారని, వారికిసైతం అవసరమైన సహకారం అందించాలని కోరారు. బలాసోర్ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవటం దారుణమన్నారు. ఇందుకు బాధ్యులైన కేంద్రం, రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బలాసోర్ వంటి దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల వారికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి రూ. 25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఏపీ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు.
