YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఆరవ రోజు కూడా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. జిల్లాస్థాయి అధికారిని విచారించిన అధికారులు.. అనుమానాస్పద వాహనం వివరాలు, హత్య జరిగిన తర్వాత ఫోటోలు ఎవరు తీసారనే అంశంపై కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆరవరోజు ఓ ఇన్నోవా వాహనం యజమానిని కూడా ప్రశ్రిస్తున్నారు అధికారులు.
రవాణా శాఖ అధికారుల సహకారంతో పలు అనుమానాస్పద వాహనాలపై దృష్టిసారించిన అధికారులు.. అనుమానితుల పేర్లను నోట్ చేసుకుంటున్నారు. విచారణ మొదలుపెట్టిన తర్వాత.. మొదటిరోజు వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ అధికారులు ప్రధానంగా ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులపైనే దృష్టి సారించారు.
రెండో రోజు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఇనాయతుల్లాను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆ దిశగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆ ఫోటోలు ఎవరు తీశారు ఎవరెవరికి పంపారు? ఎందుకు పంపారు? అనే కోణాల్లో విచారించారు.
మూడో రోజు వైసీపీ కార్యకర్త సునీల్ యాదవ్ను విచారించిన సీబీఐ.. దస్తగిరిని మూడో రోజు కూడా ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాతో పాటు దస్తగిరిని తొమ్మిది గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. నాలుగో రోజు దస్తగిరి, ఇనాయతుల్లా, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ను మళ్లీ పిలిపించారు. వీరితో పాటు మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రశ్నించింది సీబీఐ.