Andhra Pradesh : ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. నిధులొచ్చేశాయ్.. వారందరికీ భారీ ఊరట

Andhra Pradesh : ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త అందించింది. ఏపీలోని కూలీలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1805 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh

  • ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
  • ఏపీలోని కూలీలకు నిధులు విడుదల
  • రూ.1805 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీలో భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కూలీలకు ఊరట లభించనుంది.

Also Read : Ponnam Prabhakar : ఏపీ సీఎం చంద్రబాబుకి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ.. మీ మిత్రపక్షాల్ని కంట్రోల్ చేయండి అంటూ

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.1805.24 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధుల్లో 2025-26లోని పెండింగ్ వేతన బకాయిలూ కలిసి ఉన్నాయి.

మొత్తం రూ.1805.24 కోట్లను కేంద్రం మూడు కేటగిరీలుగా విభజించింది. ఎస్సీలకు రూ. 361.23 కోట్లు, ఎస్టీలకు రూ.253.04 కోట్లు, ఇతరులకు రూ.1190.96 కోట్లుగా పేర్కొంది. ఈ నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను విధించింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన 12 నెలల్లోపు వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని, ఒకవేళ ఆ నిధులపై ఏవైనా వడ్డీ వస్తే దానిని తిరిగి కేంద్రానికే చెల్లించాలని స్పష్టం చేసింది.

ఏపీకి ఉపాధి హామీ నిధుల విడుదలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేసి పేదలు, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తాయని అన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెమ్మసాని కృతజ్ఙతలు తెలిపారు.

అయితే, ఉపాధిహామీ పథకంలో కేంద్రం అనేక మార్పులు చేస్తోంది. ఇటీవలే పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీబీ జీరామ్‌జీ పేరుతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఇక కూలీలకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. అలాగే కూలీలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18002001001 కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక కూలీలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. ఇక పనిముట్లు కూడా అందిస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే పని కల్పించాల్సి ఉంటుంది.