కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన సినిమా ఇది.. ఇక ఆయన సినిమా ఖతం: చంద్రబాబు
ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ సినిమాలో ఉందని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : February 16, 2024 / 04:52 PM IST
Chandrababu Naidu
Chandrababu Naidu: ‘జగన్ రెడ్డికి అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది.. కాస్కో’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకూ జగన్ నడిపించిన సినిమా ఇక అయిపోతుందని చెప్పారు. ఆయన రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని అన్నారు.
ఇది ఒక చారిత్రాత్మక విషాదమని తెలిపారు. దీని కోసం కులాల కుంపట్లు రాజేశారని, విష ప్రచారాలు చేయించారని చెప్పారు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని చెప్పారు.
సీఎం జగన్, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని గురించి, దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ సినిమాలో ఉందని తెలిపారు. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. కోర్టులో ఆ ఆటలను సాగలేదని, సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ సినిమాను తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.
కాగా, రాజధాని ఫైల్స్ సినిమాలో అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్ ప్రధానపాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు భాను.
కుర్చీ మడతపెట్టి చూపించిన నారా లోకేశ్.. సీటు లేకుండా చేస్తామని జగన్కు వార్నింగ్
