Chandrababu-Jagan
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాసిన వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని, రౌడీయిజం చేయటం సరికాదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే సరికాదని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తానంటే పోలీసు ప్రొటెక్షన్ ఎలా ఇస్తారని నిలదీశారు. అక్రమాలు చేస్తాను పోలీసులు రక్షణ ఇవ్వాలంటే ఎలా? అని అన్నారు.
“ఆ విషయాన్ని ఎన్నికల అధికారులు చూసుకుంటారు కానీ, బాధ్యతగా నేను ఈ విషయంపై స్పందిస్తున్నాను. అసెంబ్లీలో మాట్లాడటం, ముఖ్యమంత్రికి లేఖ రాయడం సహా రాజకీయ పార్టీలకు అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
మరోవైపు, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై చంద్రబాబు మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ అధిక నీటిని వాడుకుంటుందన్న ఆరోపణలు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మేరకే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల్లో గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని తెలిపారు. సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నామని చెప్పారు.