KethiReddy Venkatarami Reddy(Photo : Twitter, Google)
KethiReddy Venkatarami Reddy – Chandrababu : తిరుపతిలో అనంతపురం, సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం అయ్యారు. మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి, శంకర నారాయణ, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, సిద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు.
డేటా సెంటర్ కేంద్రంగా దొంగ ఓట్లు ఎక్కించారు..
దొంగ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ నేతలపై మండిపడ్డారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 2018లో డేటా సెంటర్ పెట్టుకుని దొంగ ఓట్లు అనుసంధానం చేస్తూ టీడీపీ నేతలు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. 1972 ఎన్నికల సంఘం లొసుగుల ఆధారంగా టీడీపీ నేతలు దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పారు. చంద్రబాబు బతుకంతా మోసం చేయడమే అని, అందులో ఆయన దిట్ట అని ధ్వజమెత్తారు.(KethiReddy Venkatarami Reddy)
దొంగ ఓట్ల బండారం బయటపడుతోంది..
సుప్రీంకోర్టు, హైకోర్టులో దొంగ ఓట్లపై తాను కేసు వేసి పోరాటం చేస్తున్నాని కేతిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డ్ అనుసంధానం చేయడం ద్వారా దొంగ ఓట్ల బండారం బయట పడుతోందన్నారు. చంద్రబాబు 7సార్లు దొంగ ఓట్లతోనే గెలిచారని ఆయన ఆరోపణలు చేశారు. తిరుపతిలో నటి హనీ రోజ్ తో మీటింగ్ పెడితే.. పవన్ కల్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువగా జనాలు వస్తారని ఎద్దేవా చేశారు.
ప్రతి మున్సిపాలిటీలో 40వేల దొంగ ఓట్లు..
” పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు కుప్పంలో తొలగిస్తే చంద్రబాబు గెలుపే ప్రశ్నార్థకం అవుతుంది. ఆధార్ కార్డుతో లింక్ చేశారు. బోగస్ ఓట్లు బయట పడుతున్నాయి. 30-40 వేల ఓట్లు ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో దొంగ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు పాలనలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. చంద్రబాబు దొంగ ఓట్ల వల్లే నెట్టుకుంటూ వస్తున్నాడు. పవన్ కల్యాణ్ వేరే వాళ్ళను పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటున్నాడు.
చిరంజీవి చాలా మంచి వారు, అయినా ఓడిపోయారు.. బాలయ్య తెలివైన వాడు..
రాజకీయాల్లో 1+1 =2 ఎప్పుడూ సాధ్యం కాదు. తిరుపతిలో నటి హనీ రోజ్ తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువగా జనాలు వస్తారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు. చిరంజీవి చాలా మంచి వారు. అయినా పాలకొల్లులో ఓడిపోయారు. సినిమా స్టార్ మొదటిసారి గెలుస్తారు. రెండోసారి గెలిచింది లేదు. బాలకృష్ణ తెలివైన వాడు. సొంత ఊరిలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయేవాడు.
లోకేశ్ ది టైమ్ పాస్ యాత్ర..
రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. పల్లకీ మోయడం కాదు. నారా లోకేష్ కు ప్రజల కష్టాలు, జనాల సమస్యలు తెలియవు. లోకేశ్ యాత్రలో ఎక్కడా జనం సమస్యలు వినడం లేదు. మేనిఫెస్టోలో ప్రజలు సమస్యలు గురించి ఉండాలి. లోకేశ్ రోజుకు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మిగతాది టైం పాస్ యాత్ర చేస్తున్నాడు. పబ్లిక్ పల్స్ పట్టించుకుని పాదయాత్ర చేయాలి. ఆనాడు వైఎస్ఆర్ రైతుల సమస్యలపై పోరాటం చేశారు” అని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు.