Chandrababu delhi tour: వైసీపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం.. రెండున్నరేళ్ల పాలనపై పుస్తకం రూపొందించాం..!
టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.
- Ravikanth 10tv
- Published On : October 25, 2021 / 04:14 PM IST
Cbn2
Chandrababu delhi tour: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ఏపీలో కొనసాగుతోందని.. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్న చంద్రబాబు.. రాజ్యాంగ వ్యవస్థలు, మీడియాను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి.. కిలోమీటర్ల దూరం తిప్పుతున్నారని.. ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు. దుర్మార్గమైన ఆలోచనతోనే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఉన్మాది పాలన చేస్తున్నారని అన్నారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూముల దందా, సహజ వనరుల దోపిడీ వంటి చర్యలద్వారా సంపాదించిన దోపిడీ డబ్బుతో మాఫియాను తయారు చేస్తున్నారని.. రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడులు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి.. ఎన్నికల సంఘం.. ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా చేశారని చెప్పారు.
2430 జీవోతో.. మీడియాను కూడా నియంత్రించారని చంద్రబాబు విమర్శించారు. మీడియాపై ఈ జీవోతో దాడులు చేసేందుకు అనుకూల వాతావరణం కల్పించుకున్నారని అన్నారు. ఇలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ ఏపీలో లేదని చెప్పారు. బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి, ఆందోళనలు సృష్టించడమే వైసీపీ పని అని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా వదలడం లేదని.. పోలీసులు కూడా వన్ సైడ్ గా నడుచుకుంటున్నారని ఆవేదన చెందారు.
వేలమందిపై కేసులు పెడుతూ.. ఉగ్రవాదాన్ని సృష్టిస్తారా.. అని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని.. ఆవేదనతో బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టి మాట్లాడకుండా చేస్తున్నారని.. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో వైసీపీ పాలన తీరుపై పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నామని అన్నారు. ఇన్ని అరాచకాలు.. పోలీసుల సహకారంతోనే చేశారని అన్నారు. తాము రాజకీయ, ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు.
Read More:
YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి
Chandrababu : చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన టీడీపీ నేతల బృందం
