Guntur District: పిల్లలంటే సహజంగా ఆటలు, అందులో గొడవలు కూడా సహజమే. అయితే, ఒక్కోసారి ఈ పిల్లల గొడవలకు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లల మధ్య గొడవ పెద్దల వరకు వెళ్ళింది. ఏదో సర్దిచెప్పాలి.. లేదంటే కాస్త భయపెట్టి మళ్ళీ గొడవలు జరగకుండా ఉండాలని చెప్పాలి.. కానీ ఆ కుర్రాడి పెదనాన్న.. ఏకంగా మరో కుర్రాడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం కాపు కాసి కత్తితో కసితీరా పొడిచి చంపాడు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ముప్పాళ్లలో ఈ దారుణం జరిగింది. పఠాన్ అయూద్ ఖాన్, సైబాదీ దంపతులకు జానీ బాషా, అఫ్రిద్ అనే ఇద్దరు కుమారులుండగా అఫ్రిద్ పదో తరగతి చదువుతున్నాడు. కాగా అఫ్రిద్ అదే గ్రామానికి చెందిన మరో బాలుడు కలిసి మూడు రోజుల క్రితం వాలీబాల్ ఆడగా.. ఆటలో రేగిన వివాదం కారణంగా ఇద్దరు గొడవపడ్డారు. అఫ్రిద్ తనను అనవసరంగా కొట్టాడని మరో బాలుడు అతని పెదనాన్నకు చెప్పాడు.
ఆ బాలుడి పెదనాన్న షేక్ పెదబాజీ అఫ్రిద్ పై పగ పెంచుకుని హతమార్చాడు. తన బాబాయితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అఫ్రిద్ ను పెదబాజీ తన ఇంటి ముందుగు రాగానే కత్తితో
అత్యంత కిరాతంగా 10-12 సార్లు పొడిచాడు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండగా పోలీసులు అక్కడకి చేరుకుని పెదబాజీని పట్టుకుని.. తీవ్రంగా గాయపడ్డ అఫ్రిద్ ను ఆస్పత్రికి తరలించారు. అఫ్రిద్ ను నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మరణించాడు. నిందితుడు పెదబాజీ ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కాగా.. గతంలో బాజీ నేరచరిత్ర కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది.