Tirupati SV Medical College
Tirupati SV Medical College : ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిని ఎంచుకున్న వారే వీధి రౌడీల్లా తయారవుతున్నారు. ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు. రక్తం కారేలా కొట్టుకుంటున్నారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో మెడికోల మధ్య ఘర్షణ జరిగింది. మహేశ్, ప్రవీణ్ అనే ఇద్దరు మెడికోలపై నిన్న రాత్రి మరో మెడికో గణేశ్ దాడి చేశాడు.
నందలూరుకు చెందిన మెడికో మహేశ్ పై సర్జికల్ బ్లేడ్ తో గణేశ్ దాడి చేశాడు. దీంతో మహేశ్ తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ప్రవీణ్ అనే మరో మెడికోపైనా క్రికెట్ స్టిక్ తో గణేశ్ దాడి చేశాడు. ప్రవీణ్ కూడా చికిత్స పొందుతున్నాడు. అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డ నిందితుడు గణేశ్ పరారీలో ఉన్నాడు.
వాస్తవానికి మహేశ్, ప్రవీణ్, గణేశ్.. ముగ్గురూ స్నేహితులే. గణేశ్ మరో వ్యక్తితో కలిసి ఒక రూమ్ లో ఉంటుండగా.. ప్రవీణ్, మహేశ్ మెడికాల్ కాలేజీ హాస్టల్ లో ఉంటున్నారు. ముగ్గురు కూడా స్నేహితులే. ఈ ముగ్గురూ మరో వ్యక్తి కారులో బయటకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. మద్యం తాగాక తిరిగి హాస్టల్ కి వచ్చారు ముగ్గురూ.
హాస్టల్ గదిలోకి వచ్చాక ఒక్కసారిగా గొడవపడ్డారు. ఈ గొడవకు మద్యం మత్తే కారణం అంటున్నారు. వివాదం తారస్థాయికి చేరింది. గణేశ్ రెచ్చిపోయాడు. ప్రవీణ్, మహేశ్ లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. క్రికెట్ స్టిక్ తో తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత సర్జికల్ బ్లేడ్ తోనూ అటాక్ చేశాడు. మహేశ్ మెడ దగ్గర కత్తి గాటు పడినట్లు తెలుస్తోంది.
ఇక, స్టిక్ తో ప్రవీణ్ తల పగలగొట్టాడు. బాధితులు ప్రవీణ్, మహేశ్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రవీణ్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ గణేశ్ పరారీలో ఉన్నాడు. అతడు తిరుపతి జిల్లా వెంకటగిరికి నివాసి. మద్యం మత్తులోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.
అయితే, బుద్ధిగా చదువుకోవాల్సిన మెడికోలు.. ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడం, రక్తం కళ్లచూడటం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.
రంగంలోకి దిగిన తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పరారీలో ఉన్న గణేశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రుయా అత్యవసర విభాగంలో ప్రవీణ్, మహేశ్ చికిత్స పొందుతున్నారు. మెడికల్ కాలేజీ అధికారులు కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. హాస్టల్ లో అసలేం జరుగుతోంది? అని తెలుసుకునే పనిలో పడ్డారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ ఇలా మద్యం మత్తులో రక్తం వచ్చేలా కొట్టుకోవడాన్ని యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది.