Jamili Elections: 2029లోనే.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
- Harishth Thanniru
- Published On : December 14, 2024 / 11:27 AM IST
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహనలేని వైసీపీ నేతలు.. తమ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.
Also Read: LK Advani : బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. వైద్యులు ఏమన్నారంటే?
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీచోటా దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటితరం తెలుసుకోవాలి. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయి 2047లోనూ అదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదు. భవిష్యత్తు తరాల బాగుకోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ -2047 అని చంద్రబాబు స్పష్టం చేశారు.
సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తాం. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామని చంద్రబాబు తెలిపారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత, మాజీ ఉపప్రధాని అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. అద్వానీతో నాకు దశాబ్దాలకాలం నుంచి అనుబంధం ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు.
