CM Chandrababu
CM Chandrababu Naidu : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్విరామంగా పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు భరోసా ఇస్తూ, ఆహారం, తాగునీరు అందిస్తూ.. వరద సహాయక చర్యలను చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిచారు. తెల్లవారు జామున 4గంటలకు విజయవాడ కలెక్టరేట్ వద్ద బస్సులోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్న ఆయన.. తిరిగి సోమవారం ఉదయం 6గంటల తరువాత మళ్లీ కలెక్టరేట్ లో అధికారుతో సమీక్ష నిర్వహించారు.
Also Read : కృష్ణానదికి భారీగా పోటెత్తుతున్న వరద.. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ పిల్లర్
ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చాం.. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయి.. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
Also Read : హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు.. అధికారులు ఏం చేశారంటే..?
ఉదయం 8గంటల వరకు ఎంత మందికి ఆహారం అందించారని అధికారులను వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. బాధితులకోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని, వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా చూడాలని, అవసరమైతే వారికి హోటల్ గదులు కేటాయించాలని చంద్రబాబు సూచించారు. మినరల్ వాటర్, ఆహారం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతిని సీఎం పరిశీలించారు.