రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్ చేయాలన్నారు. కరోనా కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండని తెలిపారు. కరోనా నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, కేసుల వివరాలను అధికారులు సమావేశంలో వెల్లడించారు.
ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ నంబర్తో కూడిన హోర్డింగ్
కరోనా సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్ సెంటర్ నంబర్తో కూడిన హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ న్నారు. ఫీడ్బ్యాక్ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్ చేయాలని తెలిపారు. ప్రతి క్వారంటైన్ కేంద్రం, కరోనా కేర్ సెంటర్, కరోనా ఆస్పత్రులకు కచ్చితంగా ర్యాండమ్గా కనీసం 3 ఫోన్ కాల్స్ చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆ ఆస్పత్రులను, క్వారంటైన్ సెంటర్లను పర్యవేక్షించాలన్నారు.
కరోనా ఆస్పత్రుల్లో వైద్య సేవలపై దృష్టి
సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా కేర్ సెంటర్లు, కరోనా ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతపై దృష్టి పెట్టని అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. మనం దీర్ఘకాలం కరోనాతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే మనం ఫలితాలు సాధించలేమని సీఎం స్పష్టం చేశారు. కరోనా ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. జీఎంపీ ప్రమాణాలున్న మందులు వాటిలో చికిత్స పొందుతున్న వారికి అందాలని చెప్పారు. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్న సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.
కరోనాపై అవగాహన కల్పించాలి
కరోనా పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలన్నారు. అవి ఎక్కడ ఉన్నాయన్న దానిపై ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ఎవరికైనా కరోనా సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం ఉండాలన్నారు. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్ను విస్తృతంగా పెట్టించాలని తెలిపారు. అదే విధంగా టెస్టులు ఒక ఎస్ఓపీ ప్రకారం చేయాలన్నారు. ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని నిర్దేశించారు. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలన్నారు.
ప్రత్యేక బస్సులు వినియోగించి పరీక్షలు
కంటైన్మెంట్ ప్రాంతాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని అధికారులు అన్నారు. అలాగే హైరిస్క్ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామని తెలిపారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా సరే.. ఎక్స్రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పాజిటివ్గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండడంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు సన్నద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో వారు సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సూచించారు.
అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకం
అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్ సిద్ధం చేశామని వెల్లడించారు. కనీసం 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పెగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కరోనా విస్తృతి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారి సేవలు వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ఆ ప్రణాళికకు సీఎం అంగీకారం తెలిపారు.
అంత్యక్రియలకు రూ.15 వేలు
కరోనా కేసు వస్తే ఏ ఆస్పత్రికి కూడా వైద్యానికి నిరాకరించకూడదని.. అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, పర్మిషన్ రద్దు చేస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. ఆ మేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా వారి కోసం రూ.15వేల చొప్పున ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు.