Ap 10th, Inter Exams : ఏపీలో స్కూళ్లకు సెలవులు, షెడ్యూల్ ప్రకారమే…టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
- madhu
- Published On : April 19, 2021 / 03:58 PM IST
Ap Schools
Andhra Pradesh Education Minister : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకొనేందుకు నడుం బిగించింది. ప్రధానంగా..స్కూళ్ల నిర్వాహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్, పరీక్షల షెడ్యూల్ ఇది వరకే ప్రకటించడం జరిగిందని, అలాగే జరుగుతాయని వెల్లడించారు. 2021, ఏప్రిల్ 19వ తేదీ సోమవారం సీఎం జగన్ రెండు విడతలుగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు.
విద్యాశాఖలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతుండడం..అందులో 40 నుంచి 50 శాతం వరకు విద్యాశాఖలో వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సీఎం జగన్ కు కీలక నివేదిక అందచేశారు. అందులో భాగంగా…క్లాసులు 1-9 తరగతులను సస్పెండ్ చేయడం జరుగుతుందని, టెన్త్ క్లాస్, ఇంటర్ మీడియట్ షెడ్యూల్స్ యథాతథంగా జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
పరీక్షలు వాయిదా వేయడం వల్ల..ఉద్యోగాల విషయంలో నష్టపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1 నుంచి 9వ తరగతి వరకు క్లాసులు లేకపోవడంతో…టెన్త్, ఇంటర్ విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ…క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్కూళ్లలో శానిటైజేషన్, ఐసోలేషన్ గదులను కూడా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, కేంద్రం పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కూడా పరీక్షలను వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. కానీ..ఇంటర్, టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని చెప్పడంతో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.
