ఏపీ, తెలంగాణ బోర్డర్ లో గందరగోళం 

  • Publish Date - June 1, 2020 / 07:51 AM IST

ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టెదొకదారి అన్న చందంగా తయారయ్యింది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీంతో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనదారులు గరికపాడు, తిరువూరు చెక్ పోస్టుల వద్ద పలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  

లాక్ డౌన్ 5 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. అందులో అంతరాష్ట్ర ప్రయాణాలకు ఎటువంటి అనుమతులు అక్కర్లేదని చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేసింది. కేంద్ర ప్రకటన వెలువరించే వరకు ఎటువంటి పాసులు లేకపోయినా… తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను, అందులో ప్రయాణిస్తున్న వారి వివరాలు నమోదు చేసుకుని గరికపాడు చెక్ పోస్టు వద్ద నుంచి ఏపీ లోకి అనుమతించేవారు. 

కేంద్ర ప్రకటన వచ్చిన తర్వాత ఆదివారం నుంచి ఈ నిబంధనలు మరింత కఠినతరం చేశారు ఏపీ పోలీసులు. తెలంగాణ లేదా ఏపీ…ఏదో ఒక  రాష్ట్రం నుంచి పాస్ ఉంటేనే ఏపీలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అంతరాష్ట్ర రాకపోకలపై  బోర్డర్ లో షరతులు కొనసాగుతాయని డీజీపీ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. 

మరోవైపు…..ఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే వారికి బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు  నిర్వహిస్తామని…పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున సహకరించాలని  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరీక్షల్లో నెగటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్లోనూ…పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్ లోనూ ఉండాలని సూచించింది. 

కాగా… ఏపీ లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని… కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలని..కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాలని…పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు  హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.  దీంతో ఏపీలోకి ప్రవేశించే తిరువూరు, గరికపాడు చెక్ పోస్టులు వద్ద తెలంగాణ నుంచి వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  

Read: ఏపీలోకి రావాలంటే షరతులు వర్తిస్తాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్