Janga Gautam
APCC Working President Janga Gautam : తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపు ప్రజలకు చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా తేలేదని, పోలవరం పూర్తి చేయలేదని విమర్శించారు. అంతేకాకండా విభజన చట్టంలోని హామీలను కేంద్రం నుంచి మాట్లాడి తేలేకపోగా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రధాని మోదీ నుంచి ఏం తేలేకపోయారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలతో ఏపీ ప్రజలకు లాభం లేదన్నారు. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే విభజన చట్టంలోని హామీలతో పాటు ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి ఓటు వేసి మోసపోవద్దని సూచించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. ఏపీ ఆత్మగౌరవాన్ని జగన్.. మోదీ కాళ్ళ వద్ద పెట్టారని ఆరోపించారు. బలహీనవర్గాల సాధికారతే కాంగ్రెస్ లక్ష్యం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందన్నారు.
డిసెంబర్ 13న ఏపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలో నిర్వహించబోతున్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల రోడ్ మ్యాప్ ను సిద్ధ చేసి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 14న జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.