లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు ఒక్కసారిగా తెరిచేసరికి మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. 40కి పైగా రోజులుగా మద్యం చుక్క దొరక్క మందుబాబులంతా అల్లాడిపోయారు. పక్క రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిస్తే అక్కడి వరకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలన్ని కిటకిటలాడిపోతున్నాయి. భౌతిక దూరం పాటిస్తూనే మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యానికి బానిసైనవారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యానికి వారిని దూరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది.
అంతేకాదు.. మద్యం కొనుగోళ్లుపై కూడా నిబంధనలు విధించారు. నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని మద్యం షాపుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్ల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు చూపించాల్సిందిగా నిబంధన విధించారు. గొడుగులు, మాస్కులు ధరించకుంటే మద్యం విక్రయించొద్దని ఆంక్షలు విధించారు.
రాష్ట్రంలో మొత్తం 3,463 మద్యం షాపులున్నాయి. అందులో 2,330 షాపులను మాత్రమే తెరిచారు. 663 మద్యం షాపులు కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో ఉన్నాయి. దాంతో ఆయా మద్యం షాపులను తెరిచే పరిస్థితి లేదు. ప్రజల ఆందోళనలతో 16 షాపులను, శాంతి భద్రతల సమస్యల కారణంగా 69, ఇతర కారణాలతో 284 మద్యం షాపులను మూసివేశారు.
Also Read | ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. గొడుగులతో క్యూలైన్లో వేచి ఉన్న మందుబాబులు