Corona cases registered heavily in Prakasam : ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు.
ఉదయం 6 నుంచి 10 గంటలు.. సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు మాత్రమే.. సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు జిల్లాలో వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా కొనసాగుతోందని వెల్లడించారు. రెండో డోసు వేయించుకునే వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని.. ఆక్సిజన్ వృధాను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలోని మంత్రి వర్గం చర్చించి తగిన సూచనలను కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇవ్వనున్నారు.