×
Ad

Cyclone Montha: తుపాను ఎఫెక్ట్.. ఏపీ ఆర్టీసీ హైఅలర్ట్.. ఆ ప్రాంతాలకు బస్సులు నిలిపివేత..!

ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు.

  • Published On : October 27, 2025 / 08:22 PM IST

Cyclone Montha: మొంథా తుపాను ముంచుకొస్తుంది. ఏపీ తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ఇప్పటికే తుపాను కారణంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ అలర్ట్ అయ్యింది. వేగంగా ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎండీ దిశానిర్దేశం చేశారు.

పరిస్ధితులకు అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రమాదాలకు తావివ్వకుండా బస్సులు నడపాలని సూచించారు. ప్రయాణికుల రద్దీ మేరకు మాత్రమే దూరప్రాంతాలకు బస్సులు నడపాలన్నారు. రద్దీ లేని ప్రాంతాలకు అవసరమైతే సర్వీసులు నిలిపివేయాలని ఆదేశించారు.

వంతెనలు, రోడ్లపై ప్రవాహాలు ఉండే ప్రాంతాలకు బస్సులు నిలిపివేయాలన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల వినతి మేరకు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.

Also Read: ఒక్కో కుటుంబానికి రూ.3వేలు క్యాష్, 25కిలోల బియ్యం ఇంకా.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు