Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంకు వెళ్లిన పవన్.. వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లాడు. పవన్కు వృద్ధురాలు, ఆమె కుటుంబం ఆప్యాయంగా స్వాగతం పలికారు. నాగేశ్వరమ్మను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఇప్పటం గ్రామానికి వచ్చిన పవన్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ మా గ్రామానికి రావాలంటూ కోరగా.. తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. పవన్ తాజాగా ఇప్పటం గ్రామంలో పర్యటించారు. నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.
పవన్ను చూసిన వెంటనే నాగేశ్వరమ్మ భావోద్వేగానికిలోనయ్యారు. నువ్వు సీఎం కావాలి.. అది నేను చూడాలి అంటూ ఆశీర్వదించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్ కల్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాగేశ్వరమ్మ యోగక్షేమాలు తెలుసుకున్న పవన్.. ఆమెకు బట్టలు పెట్టారు. రూ. 50వేల నగదు అందించారు. నెలనెలా 5వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. మనవడి చదువు కోసం రూ.లక్ష అందించిన పవన్.. మూడో కొడుకు ట్రీట్మెంట్ కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.3లక్షలను పవన్ ఇచ్చారు.