Dhulipalla Narendra Kumar: అందుకోసమే సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు: టీడీపీ నేత ధూళిపాళ్ల
అధికారం వల్ల అహంకారం తలకెక్కిందని ధూళిపాళ్ల చెప్పారు. ఆ అహంకారాన్ని ఎన్నికల్లో ఓటర్లు దించుతారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : July 24, 2023 / 04:14 PM IST
Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Kumar – YS Jagan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పేదల వినాశనమే ధ్యేయంగా సీఎం జగన్ పోరాటం చేస్తున్నారంటూ టీడీపీ (TDP) నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ పేదలపై ప్రేమ చూపుతున్నట్లు నటించి, విషం చిమ్ముతున్నారని ధూళిపాళ్ల అన్నారు. అమరావతిలో జగన్ చేపట్టిన ఇళ్ల నిర్మాణం పేదలను మోసగించటంలో భాగంగానే అని చెప్పారు. పేదలకు ఇళ్లు అవసరమైన చోట నిర్మించకుండా, అనవసరమైన ప్రాంతాల్లో నిర్మిస్తున్నారని అన్నారు.
పేదలపై జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి పోలవరం నిర్వాసితులకు ఇళ్లు ఎందుకు కట్టివ్వలేదని ధూళిపాళ్ల నిలదీశారు. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉంటే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జగన్ ఎందుకు వృథా చేస్తున్నారని నిలదీశారు. అమరావతిలో టీడీపీ నిర్మించిన 5 వేల టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
జోగి రమేశ్ ఓ అసమర్థ మంత్రి అని, 30 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, మూడు లక్షలు కూడా కట్టలేకపోయారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. అధికారం వల్ల అహంకారం తలకెక్కిందని చెప్పారు. ఆ అహంకారాన్ని ఎన్నికల్లో ఓటర్లు దించుతారని అన్నారు.
