Botcha Satyanarayana (Photo : Twitter)
Botcha Satyanarayana – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా? అసలు అలాంటి వ్యక్తికి ఏపీకి అవసరమా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రక్తపు మరకలు అంటిన ముఖ్యమంత్రి మనకి కావాలా? అంటూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స ఆ విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇక, సచివాలయాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటానని పవన్ కల్యాణ్ కు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ. 40వేల మంది జనాభాకు సచివాలయాల్లో 40మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. ఆఫీసులు చుట్టూ తిరగకుండా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని మంత్రి బొత్స వెల్లడించారు. నారా లోకేశ్ ఒక రాజకీయ నాయకుడు అయితే పవన్ కల్యాణ్ ఓ సెలెబ్రిటీ..అంటే.. వాళ్లేమీ మునులు కాదని విమర్శించారు మంత్రి బొత్స.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా మంత్రి బొత్స స్పందించారు. ఆ యాత్రను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
ఇక, విద్యాశాఖకు సంబందించి ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ విద్యా కానుక ఇచ్చారని మంత్రి బొత్స చెప్పారు. విద్యాకానుకపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు 8 లక్షల ట్యాబ్ లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది యూనిఫాం మార్చాం అన్నారు. గతేడాది మిగిలిన యూనిఫామ్ ఏపీ అర్జేసీ విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆఖరులో అదనంగా ఇచ్చామన్నారు మంత్రి బొత్స. 39 లక్షల 96 వేల యూనిఫామ్ లు కొనుగోలు చేశామన్నారు.