Drone Summit 2024: అమరావతిలో డ్రోన్ సమ్మిట్.. దేశంలోనే అతిపెద్ద ఈవెంట్.. ఐదు వేలకుపైగా డ్రోన్లతో డ్రోన్ షో..
ఏపీ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో జరిగే డ్రోన్ సమ్మిట్ దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు.
- Harishth Thanniru
- Published On : October 17, 2024 / 12:56 PM IST
drone summit 2024
Amaravati Drone Summit 2024: డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్స్ వినియోగంతోపాటు.. తయారీకి ఏపీని కేంద్రంగా నిలపాలనే ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో 2030 కల్లా డ్రోన్స్ తయారీకి కేంద్రంగా భారత్ ను నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. 14 రంగాల్లో డ్రోన్స్ వినియోగానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరికంటే ముందే అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఈనెల 22, 23 తేదీల్లో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా కొనసాగనుంది.
Also Read: Samantha : కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత..
వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతిభద్రతలు, తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా సదస్సు జరగనుంది. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఏపీ ప్రభుత్వం ఈ సదస్సులో రూపకల్పన చేయనుంది. డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో భారీ ప్రదర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా 2వేల డ్రోన్స్ తో షో నిర్వహించగా.. ఏపీ ప్రభుత్వం అంతకు మించి డ్రోన్స్ తో మెగాషో నిర్వహించి రికార్డు సృష్టించాలని భావిస్తోంది.
Also Read: Supreme Court: ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..? ఆయన్నే తదుపరి సీజేగా చంద్రచూడ్ ఎందుకు ప్రతిపాదించారు ..!
తాజాగా.. ఏపీ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో జరిగే డ్రోన్ సమ్మిట్ దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్, తయారీ, ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఒక పాలసీ తయారు చేస్తున్నారని, ఈ సమ్మిట్ లో భాగంగా 14 థీమ్స్ తో కార్యక్రమాలు, డ్రోన్ హ్యాకథాన్, 5వేలకుపైగా డ్రోన్స్ తో డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. విజయవాడ వరదల సందర్భంలో డ్రోన్లను సహాయ చర్యల్లో వినిగించడం జరిగిందని, సహాయ బృందాలుసైతం చేరుకోలేని పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, మందులుసహా అనేక రకాలుగా సహాయం అందించామని సురేష్ కుమార్ అన్నారు. వరదల తరువాత కూడా డ్రోన్లను ఉపయోగించి సేవలు అందించామని ఏపీ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ పేర్కొన్నారు.
