CP Kanthi Rana Tata
Vijayawada CP Kanthi Rana Tata : ఏపీలోని విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఆగస్టు17న చలో విద్యుత్ సౌధకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో ఆగస్టు17న విద్యుత్ కార్మిక సంఘాలు చేపట్టే చలో విద్యుత్ సౌధకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. విజయవాడ పరిధిలో సెక్షన్ 144 అమలులో ఉంటుందని అన్నారు. నిరసన కార్యక్రమాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.
ఇది గమినించి ఎవరూ చలో విద్యుత్ సౌధకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసుల హెచ్చరికలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవాడ నగరమంతా మూడు వేల మందికి పైగా పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడలోని విద్యుత్ సౌధ, బీఆర్డీఎస్ రోడ్డు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘాలో ఉంటాయని సీపీ తెలిపారు. అయితే, చలో విజయవాడకు రావొద్దని విద్యుత్ సంఘాల నేతలకు ఇప్పటికే నోటీసులు కూడా పంపామని, వాటిని బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన మహాధర్నాతో బహిరంగ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వర్క్ టు రూల్ పాటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు విద్యుత్ సంస్థల యాజమాన్యానికి సోమవారం విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగులు భావిస్తున్నారు.