Farmer Dies Of Heart Attack : కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తున్న రైతు గుండె ఆగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన భూమిని ఆక్రమించుకున్నారంటూ అధికారుల ముందు వాపోతూ ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలోనే కుప్పకూలి మరణించాడు రైతు రత్నం.
తన భూ సమస్యను పరిష్కరించాలంటూ రెండు రోజులుగా తహసీల్దార్ ఆఫీసు ముందు రైతు రత్నం నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 40ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని మరొకరు ఆక్రమించుకున్నారంటూ రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించాడు రైతు రత్నం.
దీంతో తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది స్పందించారు. మాట్లాడాలి అంటూ పోలీసుల సాయంతో రైతుని ఆఫీసులోకి తీసుకెళ్లారు. భూ సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని రైతు రత్నం అధికారులను వేడుకుంటున్నాడు. ఇంతలో సడెన్ గా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అధికారులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అధికారులు రైతు దగ్గరికి వెళ్లారు. అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, అతడిలో చలనం లేదు. అప్పటికే రైతు రత్నం మరణించాడు. గుండెపోటు రావడంతో రైతు రత్నం చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.