Daggubati Venkateswara Rao: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. గతంలో రాజకీయాలకు, నేటి రాజకీయాలకు పొంతన లేదని, అందుకే ఇకనుంచి ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నేను నా కొడుకు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని, ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు.
Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు
ఇంకొల్లుతో తనకున్న అనుబంధంతో ఇక్కడ తన మనసులోని మాట చెప్పానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదని, గతంలో రాజకీయాలకు, నేటి రాజకీయాలకు పొంతన లేదని, అందుకే నేను, నా కొడుకు హితేష్ రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవటం జరిగిందని చెప్పారు. అయితే, కేవలం రాజకీయాల నుంచి మాత్రమే తప్పుకుంటున్నామని, ప్రజాసేవలో మాత్రం రాజీలేదని దుగ్గుబాటి అన్నారు. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటికితోడు ఆయన కుమారుడుసైతం రాజకీయాల నుంచి తప్పుకుంటాడని చెప్పడం విశేషం.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పర్చూరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగానూ పనిచేశారు. లోక్ సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి దగ్గుబాటి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. దీంతో పర్చూరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశాడు. కానీ, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై ఓడిపోయాడు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల ఆయన, ఆయన కుమారుడు వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని దగ్గుబాటి సంచలన ప్రకటన చేశారు. ఇదిలాఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఏపీ బీజేపీలో ఆమె కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు.