దాడులు చేస్తున్నారు.. మానసికంగా వేధిస్తున్నారు : కాకాణి గోవర్ధన్ రెడ్డి
రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారు.. చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
- Harishth Thanniru
- Published On : June 22, 2024 / 12:29 PM IST
Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం మొదలైంది.. వైసీపీ నేతలపై దాడులు చేయడంతోపాటు మానసికంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారమిస్తే టీడీపీ నేతలు ఏమి చేస్తారనే విషయం తేట తెల్లమవుతోందని కాకాణి అన్నారు. తోటపల్లి గూడూరు మండలంలో ఆక్వా రైతుల ఆస్తులను తగలబెట్టారు.. ఆక్వా గుంటల్లో విషాన్ని కలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధ్వంసాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..
రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారు.. చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతల ఆస్తులపై దాడులు చేసినా భయపడాల్సిన పనిలేదని క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కాకాని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని పగలగొట్టడం సరికాదు. ఎమ్మెల్యేలు నిన్ననే ప్రమాణం చేశారు. ఆరోజు నుంచే విధ్వంస పాలనను ప్రారంభించారు. వైసీపీ నేతల ఆస్తులను పగలగొడతామని సంకేతం ఇచ్చారంటూ కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు.. ఏకగ్రీవ ఎన్నిక
రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలంలో వైసీపీ నేతల ఆస్తులను కూలగోడుతున్నారు. కట్టడాలను కూల్చే సమయంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల దాడులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు.. అండగా ఉంటాం. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అప్పటికైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. విధ్వంసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
