Chinta Mohan: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, మొన్న జేపీ నడ్డా ఏపీకి వచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. ఒరిస్సాలో రైలు ప్రమాదంకు కారణం బీజేపీ అని, సిగ్నలింగ్ వ్యవస్థలో 10వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. 280 మంది చనిపోయారని బీజేపీ వాళ్ళు చెప్పారు.. కానీ, రైలు ప్రమాదంలో చనిపోయింది వెయ్యి మంది. ఆ వివరాలు బయటకురాకుండా రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేశారంటూ ఆరోపించారు.
తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ పేద ప్రజలకు చేసిందేమీలేదని, ప్రజలు తిండిలేక చనిపోతున్నారని అన్నారు. ఓబీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు బీజేపీ ఏం చేసిందని చింతా మోహన్ ప్రశ్నించారు. మాట్లాడితే పాకిస్తాన్ పేరు చెప్పి హడావుడి చేస్తారని విమర్శించారు. దేశంలో బీజేపీ ఓటమి మొదలైందని, ఏపీలో బీజేపీకి పునాదులు లేవని అన్నారు.
Tirumala : శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్ లో మార్పులు
ఏపీలో నాలుగు సంవత్సరాల వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. జైలు, బెయిలు, హత్యలు, ఆత్మహత్యల్లో అభివృద్ధి సాధించారని.. మరోవైపు పేదవాడు అకలితో అల్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతి, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్లు తానే తెచ్చానని, రాజశేఖర్ రెడ్డి చెబితే ఎయిర్ పోర్ట్లకు అన్ని అనుమతులు తాను ఇచ్చానని చింతా మోహన్ అన్నారు. అదాని, అంబానీకి కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని.. అదాని తన వద్దకు వస్తే కుర్చోమని కూడా అనలేదని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుపై చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కాదు.. తొందరిబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. అమిత్ షా, నడ్డాతో ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ 125 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం పెరిగిందని, ప్రజలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిఎంగా కాపులకు రెండున్నర సంవత్సరాలు, మరో రెండున్న సంవత్సరాలు మరో కులానికి అవకాశం ఇస్తామని చెప్పారు.
Virat Kohli: మౌనమే మార్గం..! డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తరువాత కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్..
ఏపీని రెండు రాష్ట్రాలుగా విడదీసి కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పుచేసిందని మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చిరంజీవిని చేసి ఉంటే రాష్ట్ర విడిపోయి ఉండేది కాదని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంని చేసి కాంగ్రెస్ అధిష్టానం పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఇప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నాడని చింతా మోహన్ విమర్శించారు.