Andhra Pradesh : కుప్పం ప్రభుత్వాస్పత్రిలో ఉచిత భోజనం నిలిపివేత .. రోగుల ఆకలి కేకలు .. పట్టించుకోని అధికారులు
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోగులకు పెట్టాల్సిన ఉచిత భోజనం సరఫరా నిలిచిపోయింది. రోగులకు భోజనం అందటంలేదు. దీంతో రోగులు వారి సహాయకులు బయటనుంచే భోజనాలు తెప్పించుకుని తినాల్సిన పరిస్థితి నెలకొంది.
- nagamani
- Published On : September 15, 2022 / 11:34 AM IST
Free meals have been stopped for patients in Kuppam area government hospital
Andhra Pradesh : కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోగులకు పెట్టాల్సిన ఉచిత భోజనం సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులకు భోజనం అందటంలేదు. దీంతో రోగులు వారి సహాయకులు బయటనుంచే భోజనాలు తెప్పించుకుని తినాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోని పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వేరే దారి లేక అక్కడే రోజులు..వారాలే కాదు నెలల తరబడి వేచి చూసి వైద్యం చేయించుకుంటుంటారు. అటువంటి పేదలకు ప్రభుత్వం తరపునుంచే భోజనం అందించేవారు గతంలో. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రోగులకు అందించాల్సిన ఉచిత భోజన సదుపాయం నిలిచిపోయింది. ఆస్పత్రిలో రోగులకు ఉచితంగా భోజనం పంపిణీ చేసే కాంట్రాక్టు పూర్తి కావడంతో గుత్తేదారుడు సరఫరా నిలిపేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాల్సి ఉంది. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో రోగులు వారి సహాయకులు బయటనుంచి భోజనాలు తెప్పించుకోవాల్సి వస్తోంది.
కుప్పం ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిలో రోగులకు ఉచితంగా భోజనం పంపిణీ చేసే కాంట్రాక్టు పూర్తి కావడంతో కాంట్రాక్టరు భోజనం సరఫరా నిలిపేశాడు. దీంతో పదిహేను రోజులుగా ఉచిత భోజనం లేక ఆస్పత్రిలో చేరిన రోగులు అలమటిస్తున్నారు. రోగుల బంధువులు ఇళ్లు, హోటళ్ల నుంచి భోజనాలు తీసుకురాగా.. ఆకలి తీర్చుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 80 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. ప్రైవేటుగా వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. అదనంగా భోజన ఖర్చులు భరించలేక పోతున్నామని ప్రభుత్వాసుపత్రిలో చేరిన రోగులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కుప్పం ప్రజలకు వైద్య సేవలు అందించటానికి ఉణ్న ఏకైక ప్రభుత్వ ఏరియా 100 పడకల ఆస్పత్రి.. చికిత్సల నిమిత్తం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచే కాకుండా పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. రోజూ 350-500 మంది ఓపీలతో ఆస్పత్రి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో ఇన్ పేషెంట్లకు ఆస్పత్రిలో భోజనం సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడలా లేదు. రోగులకు ఉచితంగా భోజనాలు అందించే గుత్తేదారుడి టెండర్లు ఆగస్టు 31కి పూర్తి కావటంతో సరఫరాను నిలిపివేశాడు సదరు కాంట్రాక్టరు. దీంతో 15 రోజులుగా ఉచిత భోజన సదుపాయం లేక రోగులు భోజనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
