Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం
ఏపీలోని పెనుగొండలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడ దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి నగలతోపాటు, కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించారు.
- Narender Thiru
- Published On : October 1, 2022 / 01:54 PM IST
Rs 6 crore decoration: నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టించే దుర్గాదేవి మండపాలతోపాటు, అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేకంగా అలంకరిస్తారు. తాజాగా ఏపీ, విశాఖపట్నం పరిధిలోని, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అమ్మవారి ఆలయం మొత్తాన్ని రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇలాంటి అలంకరణ దేశంలోనే మరోటి లేదని చెప్పొచ్చు. మొత్తం ఆరు కిలోల బంగారం, 3 కిలోల వెండితోపాటు, రూ.3.5 కోట్ల విలువైన కరెన్సీని అలంకరణ కోసం వాడారు. ఇక్కడి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దాదాపు 135 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఇక్కడ దాదాపు రెండు దశాబ్దాల నుంచి అమ్మవారికి బంగారం, వెండితో అలంకరిస్తున్నారు. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ సందర్భంగా నగలు, బంగారం, వెండితో అలంకరించారు.
దేవాలయ గోడలు, పైకప్పు, అంతా కరెన్సీ నోట్లు, నగలతో అలంకరించారు. కరెన్సీ నోట్లతో రకరకాల డిజైన్లు రూపొందించారు. శుక్రవారం ఇక్కడి అలంకరణ చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కాగా, ఈ నగలు, కరెన్సీ అంతా భక్తులు ఇచ్చిందేనని, నవరాత్రులు పూర్తైన తర్వాత వారికి తిరిగి ఇచ్చేస్తామని ఆలయ సిబ్బంది చెప్పారు. ఇందులోంచి ఆలయ ట్రస్ట్కు ఎలాంటి నగదు చేరదని సిబ్బంది అన్నారు.
