×
Ad

Tdp Vs Ycp: అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. మండలిలో బిగ్ ఫైట్

మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది.

  • Published On : February 27, 2026 / 08:48 PM IST

Chandrababu Naidu Representative Image (Image Credit To Original Source)

 

  • 2020లో పెద్దల సభలో అప్పటి అధికార పక్షంతో టీడీపీ ఢీ
  • ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం..కూటమికి సవాల్
  • వాడీవేడీ చర్చలు, మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్
  • మండలి ఛైర్మన్‌ తీరుపై అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ అసంతృప్తి

Tdp Vs Ycp: ఏపీలో మండలి సమావేశాలు ఇంట్రెస్టింగ్‌గా నడుస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయినా..ఇప్పుడు కూటమి పవర్‌లో ఉండగా..మండలిలో మాత్రమే చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. 2020లో మండలిలో టీడీపీ బలంగా ఉండేది. అప్పుడు అసెంబ్లీలో వైసీపీకి 151 సీట్లు ఉండటంతో వార్‌ వన్ సైడ్ అన్నట్లుగా సమావేశాలు నడిచాయి. టీడీపీ సభకు వెళ్లినా గొడవ జరగడం, వాకౌట్‌లు అంటూ నిరసన వ్యక్తం చేయడం నడిచేవి. దీంతో సంఖ్యాపరంగా అప్పుడు వైసీపీ అసెంబ్లీలో బలంగా ఉండటంతో వారిదే అప్పర్‌ హ్యాండ్‌గా ఉండేది.

అదే సమయంలో మండలిలో మాత్రం అప్పుడు టీడీపీ బలంగా ఉంటూ పోరాడుతూ వచ్చింది. అప్పుడు టీడీపీకి మండలిలో ఎమ్మెల్సీల బలం ఉండటంతో పాటు ఛైర్మన్ కూడా ఆ పార్టీ నియమించిన వ్యక్తి ఉండటంతో..పెద్దల సభలో వైసీపీ దూకుడును అడ్డుకోగలిగింది. అమరావతి బిల్లును వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినా..మండలికి వచ్చేసరికి టీడీపీ బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. దీంతో ఒకానొక సమయంలో అప్పటి వైసీపీ సర్కార్ మండలిని రద్దు చేసే ఆలోచన కూడా చేసింది.

ఇప్పుడు సీన్ మారింది. సీట్లు కూడా మారాయి. విపక్షంలో ఉన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు. మండలిలో మాత్రం తమకున్న బలంతో స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో 164 సీట్లతో బలంగా ఉన్న కూటమి అక్కడ తమ వాయిస్‌ను వినిపిస్తూ, వైసీపీ తప్పులను ఎత్తిచూపుతోంది. మండలిలో వైసీపీ బలంగా ఉండటంతో..కూటమి సర్కార్ ఏం‌ చేసినా అడ్డుకుంటుండంతో కూటమికి అక్కడ సవాల్‌గా మారింది. కల్తీ నెయ్యిపై చర్చ సందర్భంగా..రచ్చ రచ్చ అయింది. కల్తీ నెయ్యి అంశంపై షార్ట్ డిస్కషన్‌కు ఛైర్మన్ మోషేన్‌ రాజు అనుమతించారు. వైసీపీ సభ్యుడు పి.చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. అయితే స్వల్పకాలిక చర్చ కోసం వైసీపీ నోటీసు ఇవ్వకపోయినా..ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశమిచ్చారంటూ టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

సేమ్‌టైమ్‌ దేవాదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి కల్తీ నెయ్యి అంశంపై ప్రకటన చేసేందుకు లేచి నిలబడ్డారు. అయినా మండలి ఛైర్మన్‌..వైసీపీ సభ్యుడికే లఘు చర్చను ప్రారంభించే అవకాశం ఇచ్చారంటూ టీడీపీ మరోసారి అబ్జక్షన్స్ వ్యక్తం చేసింది. ఈ సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, మండలి ఛైర్మన్ మోషేన్‌ రాజు మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. వైసీపీ ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించి లఘు చర్చకు అనుమతించడమే కాకుండా, ప్రభుత్వం తరఫున ప్రకటనకు నిరాకరించడం సరైంది కాదంటూ..టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వాదోపవాదాలు, అధికార-విపక్ష సభ్యుల ఆందోళనలతో మండలిలో గందరగోళం ఏర్పడింది. చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది.

పెద్దల సభలో వైసీపీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం..

అయితే ఇప్పుడు మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే షార్ట్ డిస్కషన్‌పై నిబంధనలు పక్కన పెట్టి మండలి ఛైర్మన్ వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. మోషేన్ రాజు మాత్రం..అధికార పక్షం అలిగేషన్స్‌ను తప్పుబడుతున్నారు. నోటీస్ విషయంలో పక్కదారి పట్టించేలా మాట్లాడటం సరికాదంటున్నారు. దీంతో మండలిలో కూటమి వర్సెస్ వైసీపీ ఫైట్‌ ఆసక్తికరంగా మారింది.

మండలిలో పెరగనున్న కూటమి బలం..

మరోవైపు మండలిలో అప్పర్ హ్యాండ్ సాధించేందుకు కూటమి ప్లాన్స్ చేస్తుంది. ఇప్పటికే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీల్లో చేరారు. ఇందులో ఐదుగురు రాజీనామా చేయగా..స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్నారు. ఈ ఐదుగురి రాజీనామాలను మండలి ఛైర్మన్ ఆమోదిస్తే..ఆ సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. అప్పుడు మండలిలో కూటమి బలం పెరగనుంది. తర్వాత మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలను కూడా ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి కూటమి గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సేమ్‌టైమ్‌ కొందరు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ సీట్లు కూడా కూటమినే కైవసం చేసుకోనుంది. ఏదైనా మండలిలో జరుగుతున్న ఫైట్‌..పొలిటికల్ హాట్ టాపిక్‌గా..పబ్లిక్ అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసేలా ఉందనడంలో డౌటే లేదు.

Also Read : ఉగాదికి ఇళ్ల జాతర.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్