ఆ ఆరుగురు పోలీసు అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..! త్వరలో చర్యలు? ఎందుకో తెలుసా..

Gossip Garage : ఏపీలో పోస్టింగ్‌లు లేకుండా వీఆర్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో చంద్రబాబు సర్కార్‌ హిట్‌ లిస్టులో చేరారో గానీ, వరుసగా తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఎవరో చెప్పారని.. ఏదో చేశారని అనుకుంటే ఓకే.. కాని, ఇప్పుడు సర్కార్‌ మొత్తం అటెన్షన్‌లో ఉండగా, విజయవాడ వరదల్లో కొందరు డైవర్షన్‌ మోడ్‌లో పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రుల పర్యటనల్లో కొందరు ఐపీఎస్‌ అధికారుల పనితీరు సరిగా లేదని గుర్తించారు. దీనిపై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులిచ్చారు. దీంతో సరిగా పని చేయని ఐపీఎస్‌లపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.

16 మంది ఐపీఎస్‌లకు సీఎం చంద్రబాబు వెరైటీ శిక్ష..
తప్పు మీద తప్పు… మళ్లీ మళ్లీ అదే తప్పు… ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో కొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా బదిలీలు చేస్తుంది. ఆ సమయంలో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడుతుంది. ఐతే చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక గతంలో ఎప్పుడూ లేనట్లు ఓ 16 మంది ఐపీఎస్‌లకు వెరైటీ శిక్ష వేశారు.

వరద తగ్గగానే ఆ ఐపీఎస్ అధికారులపై చర్యలు..!
వీరంతా వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి కూర్చోవాలని మెమో జారీ చేశారు. ఇలా మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీసుకు వస్తుండగా, మరికొందరు ఏం జరుగుతుందో.. జరగనీ అన్నట్లు ఆఫీసుకు రావడం లేదని చెబుతున్నారు. ఐతే తాజాగా విజయవాడ వరదల్లో సహాయక చర్యల నిమిత్తం ఈ 16 మందిలో కొందరికి బందోబస్తు డ్యూటీలు వేశారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ఆ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరినా, సక్రమంగా పని చేయలేదని మళ్లీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసేలా… ఉద్దేశ పూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలు ఆటంకం కలిగేలా వ్యహరించారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. వరద తగ్గగానే ఈ అధికారులపై చర్యలు ఉంటాయని సీఎంవో వర్గాల సమచారం.

ఆ ఆరుగురు పోలీసు అధికారులపై సీఎంకు ఫిర్యాదు..
విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం వీఆర్‌లో ఉన్న చాలా మంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఆరుగురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగా పనిచేయలేదని, వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని అంటున్నారు. బాధితుల ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోడ్చి ఆహారాన్ని తెప్పించినా ఆరుగురు పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లను బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖిత పూర్వకంగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం… ఆ అధికారులపై సీరియస్‌ అయినట్లు చెబుతున్నారు. పని చేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని, కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సివస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఆ 16 మందిపై ప్రత్యేకంగా నిఘా..
గత ప్రభుత్వంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది పోలీసులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వీఆర్‌లో పెట్టింది. సహజంగా వీఆర్‌లో ఉన్న అధికారులు మళ్లీ పోస్టింగ్‌ వచ్చేవరకు ఇళ్లకే పరిమితమవుతుంటారు. ఐపీఎస్‌లు డీజీపీ ఆఫీసుల్లోనూ.. డీఎస్పీ ర్యాంకు అధికారుల వరకు డీఐజీ ఆఫీసులోనూ రిపోర్టు చేస్తుండాలి.. తమ సుపీరియర్‌ ఆఫీసర్‌ చెప్పే డ్యూటీలకు అటెండ్‌ కావాలి. కానీ, పోస్టింగ్‌లు లేనివారికి ఏ పని ఉండకపోవడంతో ఇళ్లలోనే ఉంటారు. పిలిచినప్పుడు వస్తుంటారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వీఆర్‌లో పెట్టిన అధికారుల్లో 16 మందిపై ప్రత్యేకంగా నిఘా వేసింది. వీరికి గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, వివిధ కేసుల్లో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే సందేహంతో రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని మెమో జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సెలవులు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు.

అందుబాటు లేరని, సరిగా స్పందించలేదని ఫిర్యాదులు..
ఇక అధికారుల సెలవులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలోనే వరదలు రావడం, విజయవాడ అతలాకుతలమవడంతో ఆ 16 మంది లిస్టులో పేర్లు ఉన్న నలుగురికి డ్యూటీలు వేశారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని వరద సహాయ చర్యల్లో పాల్గొంటే… నలుగురు పోలీసు అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడం, ఉన్న సమయంలో సరిగా స్పందించక ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వరద సహాయ చర్యల్లో నిర్లిప్తంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎప్పీలపై వేటు వేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో సహా మొత్తం మంత్రులు, ఇతర అధికారులు విజయవాడలోనే ఉన్నారు. వరద పరిస్థితులను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పని పూర్తికాగానే నలుగురు ఐపీఎస్‌ల పని పట్టాలని చంద్రబాబు డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు.

Also Read : ఇక కూల్చుడేనా? ఏపీలోనూ హైడ్రా తరహా సంస్థ తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్..!

వారిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటుందనే టెన్షన్‌..
నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలు సరిగా పని చేయలేదని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐపీఎస్‌ల భవిష్యత్‌పై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే పని లేని శిక్షకు గురైన 16 మందిలో ఇద్దరిని ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు వెంటాడుతోంది. మరో ముగ్గురిపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు. ఇప్పుడు నలుగురు.. విజయవాడ ఎపిసోడ్‌లో పనిష్మెంట్‌ ఎదుర్కోక తప్పదంటున్నారు. మొత్తానికి 16 మంది ఏదో రకంగా ప్రభుత్వానికి దొరికిపోతుండటం.. వారిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటుందనే టెన్షన్‌ పోలీసు వర్గాల్లో కనిపిస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు