Gossip Garage : కార్పొరేషన్ అన్నారు ఒకరు.. రాజ్యసభ అన్నారు ఇంకొకరు.. లేదు మొండిచేయే అని ప్రచారం మొదలుపెట్టారు మరొకరు. నాగబాబు చుట్టూ జరిగిన చర్చ ఇది. ఇలాంటి ఊహాగానాలన్నింటికి.. ఒక్క స్టేట్మెంట్తో చెక్ చెప్పేశారు పవన్. ఎమ్మెల్సీగా ప్రకటించేశారు. ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు.. మరి గతంలో మాట ఇచ్చినట్లు మంత్రివర్గంలోకి కూడా ఖాయమా.. ఈక్వేషన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా.. జనసేన సంగతి సరే.. బీజేపీ సంగతేంటి.. కమలం పార్టీకి కూడా ఓ స్థానం కేటాయిస్తారా..
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒక స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని.. ఆయనకు మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. గతంలో చంద్రబాబు, పవన్ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫార్మ్ చేశారు కూడా! అయితే
ఒక్క స్టేట్మెంట్తో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన పవన్..
రెండు రోజులుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని, దాని బదులు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని కొందరు.. రాజ్యసభ ఎంపీగా పంపిస్తారని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొందరు అయితే.. ఈసారి నాగబాబుకు ఎలాంటి అవకాశమే లేదని ఎత్తుకున్నారు. దీంతో జనసేనలో కంగారు కనిపించింది. కట్ చేస్తే ఈ ప్రచారానికి.. ఒక్క స్టేట్మెంట్తో పవన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. నాగబాబును అధికారికంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
రెండురోజులుగా నాగబాబుపై రకరకాల కథనాలు వినిపించాయ్. నాగబాబుకు ఈసారి కూడా మొండిచేయే అనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. జనసేన స్టేట్మెంట్తో అన్ని రకాల ఊహాగానాలకు చెక్ పడింది. నాగబాబుకు లైన్ క్లియర్ అయింది. నిజానికి నాగబాబు గత సార్వత్రిక ఎన్నికల్లోనే అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయాలనుకున్నారు.
Also Read : దమ్ముంటే.. అవినీతి చేయలేదని మీ పిల్లలపై ప్రమాణం చేయాలి- జగన్ కు మంత్రి లోకేశ్ సవాల్
ఉగాది లోపు క్యాబినెట్ లోకి నాగబాబు..!
అయితే చివరి నిమిషంలో ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. సీఎం రమేశ్ కు కేటాయించింది. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని భావించారు. అయితే అదీ కుదరలేదు. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి.. కేబినెట్ లోకి తీసుకుంటామని రాజ్యసభ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఇప్పుడు జరగబోయేది అదే.
నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత.. మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించబోతున్నారని తెలుస్తోంది. ఐతే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది హాట్టాపిక్ అవుతోంది. ఉగాది పండుగలోపు నాగబాబు.. కేబినెట్లోకి అడుగు పెడతారంటూ ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్బాబు, యనమల రామకృష్ణుడు పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూస్తే.. ఐదు స్థానాలు కూటమి పార్టీలు గెలుచుకోవడం ఖాయం. జనసేనకు ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరు అనేది కూడా ఇప్పుడు హాట్టాపిక్ అవుతోంది. కూటమి పార్టీల్లో ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్న వాళ్ల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. దీంతో ఈ స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కబోతోంది. టీడీపీ ఖాతాలోనే నాలుగు చేరతాయా లేదంటే.. బీజేపీ ట్విస్ట్ ఇస్తుందా అనే ప్రచారం కూడా నడుస్తోంది.
Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష హోదాపై మరోసారి ప్రస్తావన
4 సీట్లకు టీడీపీలో 10 రెట్ల పోటీ..
పిఠాపురంలో పవన్కు సీటు త్యాగం చేసిన వర్మ, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కోసం పక్కకు జరిగిన దేవినేనితో పాటు.. రాయలసీమ నుంచి కీలక నేతలు.. సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా ఈసారి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 4 సీట్లకు టీడీపీలో 10 రెట్ల పోటీ కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్లో ఆ నాలుగు స్థానాల్లో.. ఒకటి బీజేపీ కూడా ఆశిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
గతంలో రాజ్యసభ ఎంపీల వ్యవహారంలో.. రెండు టీడీపీ ఖాతాలో చేరగా.. ఒకటి బీజేపీ తీసుకుంది. ఐతే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ కమలం పార్టీ పట్టు పడుతోంది నిజమే అయితే.. టీడీపీకి మిగిలేవి మూడు స్థానాలు మాత్రమే. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయ్.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల వ్యవహారం ఇంట్రస్టింగ్గా మారిన వేళ.. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. కేంద్రం పెద్దలతో ఎమ్మెల్సీ స్థానాల వ్యవహారం చర్చకు వచ్చే చాన్స్ ఉందా.. అదే జరిగితే టీడీపీలో ఆశలు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏంటన్నది హాట్టాపిక్ అవుతోంది.