Special Officers Rule: ఏపీలో ఇక ఆఫీసర్ల హవా.. లీడర్ల దారెటు? నగరాలు, పట్టణాల్లో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందా?
రాష్ట్రంలో అధికారం మారిన పరిస్థితుల్లో లీడర్లు జంపింగ్లకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్, ఆర్థిక, అంగ బలాన్ని లెక్కలేసుకుని పార్టీలు మారితే మళ్లీ పదవులు చేపట్టొచ్చని వలస పక్షుల ఆలోచనగా చెబుతున్నారు.
- Naveen
- Published On : March 12, 2026 / 08:16 PM IST
Municipal Corporation Representative Image (Image Credit To Original Source)
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారుల పాలన
- ముగిసిన పాలకవర్గాల గడువు..ఇక స్పెషల్ ఆఫీసర్లు
- మొన్నటివరకు 90శాతం మున్సిపాలిటీలు వైసీపీ చేతుల్లోనే..
- మారుతున్న ఈక్వేషన్లు, లీడర్ల జంపింగ్లతో పొలిటికల్ హీట్..
Special Officers Rule: లీడర్ల పాలన అయిపోతుంది. ఇక ఆఫీసర్ల పాలన రాబోతోంది. మొన్నటివరకు అక్కడంతా లీడర్లదే హవా. ఇక నుంచి అధికారులే అన్నీ నడిపించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు ఆఫీసర్లే పాలన వ్యవహారాలు చక్కబెట్టనున్నారు. మొన్నటివరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హవా నడిపించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోందా? అప్పుడే ఎన్నికల వేడి రాజుకుని..పొలిటికల్ ఫైట్కు దారితీస్తోందా? అక్కడ వైసీపీ లీడర్ల దారెటు? కూటమి పార్టీల ప్లాన్ ఎలా ఉండబోతోంది?
పాలక వర్గాల గడువు ముగుస్తుంది. అధికారుల పాలన రానుంది. ఏపీలోని 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. కొత్తగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికై..పాలకవర్గాలు కొలువుదీరే వరకు మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్లు పాలనలో కొనసాగనుంది. దాదాపు 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లిపోనున్నాయి. కార్పొరేషన్లకు ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లను, మున్సిపాలిటీలకు ఆర్డీవో క్యాడర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది సర్కార్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహంచనున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగి మేయర్లు బాధ్యతలు స్వీకరించే వరకు వీరి ఆధ్వర్యంలో ఆయా నగరాల్లో పాలన వ్యవహరాలు కొనసాగనున్నాయి.
90 శాతం మున్సిపాలిటీలు వైసీపీ నేతల చేతుల్లోనే..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో లీడర్లు కుర్చీలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు 90 శాతం మున్సిపాలిటీలు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలే మున్సిపల్ ఛైర్మన్లుగా, మేయర్లుగా కొనసాగుతున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మినహా రాష్ట్రంలో మిగిలిన అన్నిచోట్ల వైసీపీనే పాగా వేసింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని చోట్ల రాజకీయ పరిస్థితులు మారడం, కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించడంతో..పది పదిహేను మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ నేతలే ఛైర్మన్లు, మేయర్లుగా ఉన్నారు. పదవీ కాలం పూర్తి కావడంతో వాళ్లంతా మాజీలు అవుతున్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నట్లు కనిపిస్తోంది.
జూన్లోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే పట్టణాల్లో రాజకీయ వేడి వేడెక్కుతోంది. ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పని చేస్తున్న వాళ్లు బరిలోకి దిగేందుకు సిద్ధపడుతుండగా..కొత్తగా మరికొందరు లీడర్లు ఎన్నికల రంగంలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారం మారిన పరిస్థితుల్లో లీడర్లు జంపింగ్లకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్, ఆర్థిక, అంగ బలాన్ని లెక్కలేసుకుని పార్టీలు మారితే మళ్లీ పదవులు చేపట్టొచ్చని వలస పక్షుల ఆలోచనగా చెబుతున్నారు.
కార్పొరేషన్లలో అయితే పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవల్కు చేరుకుంటుంది. పలు చోట్ల ఇప్పటికే మేయర్ కుర్చీలు టీడీపీ ఖాతాలో ఉండగా..కడప లాంటి చోట వైసీపీ పట్టు కొనసాగిస్తోంది. దీంతో గతంలో వైసీపీ గెలిచినట్లు వార్ వన్ సైడే అన్నట్లుగా మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోందట కూటమి. ఇదే అదునుగా పార్టీ మారాలనుకుంటున్న పలువురు లీడర్లు కూడా పావులు కదుపుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. పురపోరు నాటికి లీడర్ల జంపింగ్లు, పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా మారుతాయో? తాజా మాజీలు మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారో లేదో? ఒకవేళ పోటీ చేసినా ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారోనని లోకల్ పాలిటిక్స్ అప్పుడే వేడెక్కుతున్నాయి.
Also Read: గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి.. గ్యాస్ ఇబ్బందులకు చెక్..!
