Gossip Garage : ఏపీ బీజేపీ చీఫ్‌గా కామన్‌ మ్యాన్! జగన్ సొంత జిల్లాకు చెందిన ఆ నేతకు పగ్గాలివ్వడం పక్కానా? ఎవరీ సింగారెడ్డి రామచంద్రారెడ్డి..

Gossip Garage : బీజేపీ మార్క్ పాలిటిక్సే వేరు. అవకాశమే లేదనుకున్న చోట..అదును చూసి.. అస్త్రశస్త్రాలు వాడి..సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటుంది కమలదళం. అలాంటి స్ట్రాటజీనే ఏపీలో ఫాలో అయ్యేందుకు రెడీ అయింది. త్వరలో నవ్యాంధ్రకు కొత్త ప్రెసిడెంట్‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోన్న కాషాయ పార్టీ..ఓ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన నేతకు పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయిందట. ఆ రాయలసీమ నేత పేరు కూడా దాదాపు ఖరారు అయిందంటున్నారు. ఏపీ బీజేపీ రథసారధి ఆయనేనా? ఆ నేతకు పగ్గాలు అప్పగించడం పక్కానా.?

సొంతంగా బలపడే వ్యూహాలకు పదును..
ఎంతో కాలంగా ఏపీలో స్వతహాగా ఎదగాలని స్కెచ్చులు వేస్తోంది బీజేపీ. అందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. పొత్తులో కూటమిగా పవర్‌లోకి వచ్చి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఎన్డీయేలో టీడీపీ, జనసేనను చేర్చుకుంది. పొత్తు పొత్తే అంటూ..సొంతంగా బలపడే వ్యూహాలకు పదును పెడుతోంది.

Also Read : వైసీపీ ప్లాన్ బెడిసికొట్టిందా? ఆ విధంగా కూటమి కార్యకర్తల్లో విభేదాలకు పవన్, లోకేశ్ చెక్..!

జగన్ సొంత జిల్లా నుంచే పార్టీకి కొత్త అధ్యక్షుడి ఖరారు?
అందులో భాగంగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో తన మార్క్‌ స్ట్రాటజీ ఫాలో అవుతుంది బీజేపీ. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయిందట. టీడీపీ-జనసేనతో పొత్తు వేళ రెడ్డి సామాజికవర్గంపై అధినాయకత్వం ఫోకస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లా నుంచే పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లు సమాచారం.

 

కామన్‌ మ్యాన్‌కు పదవి కట్టబెట్టాలని నిర్ణయం..!
ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పదవీ కాలం జూలై వరకు ఉంది. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. పలువురు నేతలు బీజేపీ స్టేట్‌ పదవి రేసులో ఉన్నారు. సుజనా చౌదరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. రాయలసీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది.

విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్, పూడి తిరుపతిరావు వంటి వారు ఆశావహులుగా ఉన్నా..హైకమాండ్ మాత్రం ఎవరూ ఊహించనట్లుగా ఓ కామన్‌ మ్యాన్‌కు పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే పురంధేశ్వరినే కంటిన్యూ చేయాలని కూడా కొందరు నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది

మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం..
కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని స్టేట్‌ ప్రెసిడెంట్‌గా నియమించాలని ప్రధాని మోదీ టీమ్‌ డిసైడ్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే.. సింగారెడ్డి పేరును పరిశీలిస్తున్నారట.

సింగారెడ్డి రామచంద్రారెడ్డిది పులివెందులలోని వేంపల్లె. 1978 నుంచి ఆర్ఎస్ఎస్‌లో పని చేస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన-ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్‌గానూ రామచంద్రారెడ్డి పనిచేశారు.

కేంద్రమంత్రిగా శ్రీనివాస వర్మ లాంటి సాధారణ కార్యకర్తను ఎంపిక చేసినట్లే..
రైతు సమస్యలపై పోరాటాలు చేసిన నేతగా గుర్తింపు ఉంది. దాంతో కేంద్రమంత్రిగా శ్రీనివాస వర్మ లాంటి సాధారణ కార్యకర్తను ఎంపిక చేసినట్లుగానే..ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా పార్టీ నాయకత్వం ప్రకటన చేయడమే మిగిలి ఉందంటున్నారు.

Also Read : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?

బీజేపీలో క్రియాశీలకంగా పని చేసిన అనుభవం సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఉందంటున్నారు. కూటమి నేతలతో మంచి సంబంధాలు సింగారెడ్డికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. పార్టీ విధానపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బాగా పనిచేశారని అంటున్నారు.

మాజీ సీఎం జగన్‌ ఇలాఖ అయిన పులివెందుల వాసి కావడం, కడప జిల్లా ప్రజలకు చాలా సుపరిచితుడి కావడం సింగారెడ్డికి కలిసి వచ్చే అంశాలు. మరోవైపు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డిపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గానే ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. సింగారెడ్డికే రాష్ట్ర పగ్గాలు దక్కుతాయా? లాస్ట్ మూమెంట్‌లో చక్రం తిప్పి మరే నేతైనా లైమ్‌లైట్‌ వస్తారా అనేది చూడాలి మరి.