జగన్‌కు వరుస షాకులిస్తున్న రాజ్యసభ సభ్యులు, త్వరలో మరో ఐదు వికెట్లు డౌన్‌? ఎందుకిలా..

ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా... అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..

Gossip Garage Ysrcp Rajya Sabha Members (Photo Credit : Google)

Gossip Garage : ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిపోవడంతో ఉక్కపోత పెరిగిపోయిందేమో… వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. రాజ్యసభలో హైస్పీడ్‌ చూపిద్దామనుకున్న అధినేతకు వరుస షాకులిస్తున్నారు. అయిన వారు… అనుచరులు.. అక్కున చేర్చుకుంటారని భావించిన వారు వరుసగా బైబై అంటున్నారు. ఇక మిగిలిన వారు అదే దారిన వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట… ఇంతకీ మిగిలేది ఎందరు..?

ఒక్కొక్కరిగా వీడిపోతున్న ఎంపీలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన వైసీపీకి… రాజ్యసభ సభ్యులే ఓదార్పుగా నిలుస్తారని అంతా భావించారు. టీడీపీ కూటమికి తిరుగులేనంత బలం ఉన్నా.. రెండేళ్ల వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లేదన్న ధీమాతో కేంద్రంలో తమకు ఎదురే లేదన్నట్లు భావించింది వైసీపీ అగ్ర నాయకత్వం.. తీరా రోజులు గడుస్తున్నకొద్దీ పార్టీ అధినేతకు షాక్‌ మీద షాక్‌నిస్తూ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే సీనియర్‌ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజ్యసభతోపాటు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా బీసీ ఉద్యమ నేత, ఆర్‌.కృష్ణయ్య కూడా రాం.. రాం.. చెప్పేశారు.

వైసీపీలో కలకలం రేపిన కృష్ణయ్య..
తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా అనూహ్యంగా ఎంపిక చేసిన వైసీపీకి… అంతే అనూహ్యంగా షాక్‌ ఇచ్చారు కృష్ణయ్య. మోపిదేవి, బీద మస్తాన్‌రావు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆర్‌.కృష్ణయ్య కూడా అదే ఆలోచనలో ఉన్నారని ఉహాగానాలు వినిపిస్తే.. తాను పార్టీ మారేది లేదని మీడియా ముఖంగా ప్రకటించిన కృష్ణయ్య… ఇప్పుడు ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది.

ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి..
ఇక కృష్ణయ్య రూట్‌లో ఇంకెందరు పార్టీని వీడతారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 8 మంది రాజ్యసభ సభ్యులు మిగలగా, వీరిలోనూ కొందరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు… తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని అధికార పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో అధినేత జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, నిరంజన్‌రెడ్డి, రఘురామిరెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వంటివారు ఇంతకుముందే పార్టీ మారేది లేదని ప్రకటించారు. ఐతే ఆర్‌.కృష్ణయ్య కూడా ఇదే మాట చెప్పి రాజీనామా చేయడంతో మిగిలిన ఎంపీల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు.

ఈ నలుగురిలో ఎవరైనా.. ఏ క్షణమైనా బైబై చెప్పే చాన్స్‌?
ప్రస్తుతం ఉన్న 8 మందిలో జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యనేత విజయసాయిరెడ్డి, జగన్‌ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన పరిమళ్‌ నత్వాని టెక్నికల్‌గా వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అవసరం అనుకుంటే ఆయన బీజేపీకి గూటికి చేరిపోవడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. ఇక గొల్ల బాబూరావు తీరు ఎప్పటి నుంచో సందేహస్పదంగా ఉందంటున్నారు.

రాయలసీమకు చెందిన మేడా రఘురామిరెడ్డి, పారిశ్రామిక వేత్త అయోధ్యరామిరెడ్డి వ్యాపారాల రీత్యా బీజేపీతో సన్నిహితంగా మెలగాల్సి వుంటుందనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నలుగురిలో ఎవరైనా.. ఏ క్షణమైనా బైబై చెప్పే చాన్స్‌ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌…. అడుగులు సందేహాస్పదంగానే ఉన్నాయి. ఆయన కూడా పార్టీ మారనని గతంలో ప్రకటించారు. కృష్ణయ్య టాటా చెప్పిన తర్వాత బోస్‌ భవిష్యత్‌ కార్యాచరణపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆ ఇద్దరూ కలిపి పార్టీకి షాక్‌నిస్తారా?
గోదావరి జిల్లాల్లో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన బోస్‌ అధికారిక కూటమి వైపు చూస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం రామచంద్రాపురానికే చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన వైపు చూస్తున్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. త్రిమూర్తులు, బోస్‌ గతంలో రాజకీయ ప్రత్యర్థులైనా.. ప్రస్తుతం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరూ కలిపి పార్టీకి షాక్‌నిస్తారా? లేక ఎవరో ఒకరే వెళ్లిపోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read : 3 నెలల తర్వాత సడెన్‌గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?

పని లేని పోస్టులో ఉండేకన్నా అనే అభిప్రాయం..!
ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా… అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా, ఢిల్లీలో పని లేని పోస్టులో ఉండేకన్నా.. ఆ పదవిని అధికార పార్టీకి అప్పగించి మేలు పొందడం మంచిదనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వరుస పరిణామాలతో వైసీపీలో గందరగోళం కొనసాగుతోందంటున్నారు. ఈ వలసకు ఎక్కడ బ్రేక్‌ పడుతుందనేదే ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.