Harirama Jogaiah: ఎన్నికల వేళ ఈ విషయంపైనే పవన్ కల్యాణ్తో చర్చించాను: హరిరామజోగయ్య
బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో కలిసి వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ తెలిపినట్లు హరిరామ జోగయ్య అన్నారు.
- T Venkateshwarlu
- Published On : January 13, 2024 / 03:54 PM IST
Harirama Jogaiah-Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో రెండు రోజుల క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ఏలూరు నుంచి హరిరామజోగయ్య ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసి పూర్తి వివరాలు తెలిపారు.
‘ఇటీవల పవన్ కల్యాణ్తో సమావేశమయ్యాను. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుల అంశంపై సుదీర్ఘంగా చర్చించాను. రాష్ట్రంలో జనసేన 60 నుంచి 40 స్థానాలు బలంగా ఉన్నట్లు పవన్ కల్యాణ్కు సూచించాను. 40 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని చెప్పాను.
అధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని తెలిపాను. జనసేన కార్యకర్తలకు స్పష్టమైన హామీ రావాలని సూచించాను. మూడు పార్టీలు కలిస్తే గెలుపు మరింత సులువు అవుతుందని చెప్పాను. బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో కలిసి వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
రెండున్నర సంవత్సరాలు అయినా పవన్ కల్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారు.
అనేక అంశాలపై పవన్ కల్యాణ్తో చర్చించాను. ఆయన కూడా తా అభిప్రాయాలతో ఏకీభవించారు’ అని హరిరామజోగయ్య అన్నారు.
