ఈ ప్రాంతాల్లో 3 రోజులు కుమ్మేయనున్న వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా భక్తులను నియంత్రించాలని జగన్నాథ కుమార్ అన్నారు.
- T Venkateshwarlu
- Published On : October 1, 2025 / 05:06 PM IST
Rain Alert
Weather Updates: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ కీలక సూచనలు చేశారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా భక్తులను నియంత్రించాలని జగన్నాథ కుమార్ అన్నారు. రైలు, రోడ్డు, రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని జగన్నాథ కుమార్ చెప్పారు. అది వాయవ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించారు.
Also Read: ఈ మేడమ్ మామూలు మేడమ్ కాదు.. ప్రభుత్వ సొమ్ము రూ.కోటి కొట్టేసి, బాయ్ ఫ్రెండ్ బ్యాంక్ ఖాతాలో వేసి..
ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని జగన్నాథ కుమార్ చెప్పారు. ఇవాళ విజయనగరం,విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అలాగే, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అన్నారు. రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు ఉంటాయని జగన్నాథ కుమార్ తెలిపారు. నాలుగు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు చెప్పారు.
