Tirupati : ఎక్కడ చూసినా నీరే…భయం గుప్పిట్లో తిరుపతి

చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి.

  • Published On : November 12, 2021 / 09:53 AM IST

Tpt Rain

Heavy Rain In Tirupati : చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి. సిటీలో జనజీవనం స్తంభించింది. ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి డ్రైనేజీ నీరు చేరిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తడుకు, పుత్తూరు రైల్వే లైను నీట మునిగింది.

Read More : Cyclone Alert : నెల్లూరులో కుండపోత..50 గ్రామాలకు రాకపోకలు బంద్

తిరుమల గిరుల నుంచి భారీగా వర్షపు నీరు కిందికి చేరుడంతో తిరుపతి జలదిగ్బంధమైంది. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రుయాతో పాటు శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం, అన్నారావు కూడలి, లక్ష్మీపురం సర్కిల్‌, మధురానగర్‌, ముత్యాలరెడ్డిపల్లెలో నడుము లోతు వరద చేరింది.
ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వృక్షాలు నెలకొరగడంతోపాటు ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడ్డాయి. జలప్రసాద కేంద్రంపై, ఎంబీసీ కాటేజీ వద్ద భారీ వృక్షాలు కూలాయి. అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద భారీ వృక్షం కూలి రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

Read More : Kannur – Bengaluru : రైలుపై విరిగిపడ్డ కొండచరియలు

గురువారం రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో నిన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డు మూసివేశారు. ఘాట్ రోడ్డుల్లో విరిగిపడిన చెట్లు, బండరాళ్ళను తొలగించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరికొన్ని చోట్ల గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.  స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గాలులు, వర్షానికి తోడు విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు అవస్థపడ్డారు. రామచంద్రాపురం మండలం…పీవీ పురం వాగులో ఒక మహిళ గల్లంతయ్యింది. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సహాయక బృందాలు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నాయి.